నవతెలంగాణ-హైదరాబాద్ : తాను పాఠాలు బోధించే గురుకులంలోనే ఓ అధ్యాపకురాలు వేధింపులకు గురయ్యారు. వాటిని భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం జరిగిందీ దారుణం. చెన్నూరు పట్టణ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి(39) చెన్నూరు పట్టణంలోని ఆదర్శనగర్లో నివాసముంటున్నారు. చెన్నూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాలుగేండ్లుగా జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రిన్సిపల్ ఆమెకు మెస్ కేర్టేకర్గా అదనపు బాధ్యతలిచ్చారు. వాటితో పని ఒత్తిడి అధికమైందని, మెస్కు సంబంధించిన అంశాల్లో ప్రిన్సిపల్ రాజమణి సహా కొందరు ఉపాధ్యాయులు వేధిస్తున్నారంటూ ఆమె భర్త సంపత్తో చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో తిరుమలేశ్వరిని భర్త గురుకులం వద్ద దింపి వెళ్లాడు. రెండు గంటల తర్వాత భార్యకు ఫోన్ చేశాడు. ఇతరులు ఫోన్లో మాట్లాడి, పెద్దచెరువు ఒడ్డున బ్యాగు ఉందని చెప్పడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లాడు. చెరువులో భార్య అచేతనంగా పడి ఉండగా ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ‘భర్త ఫిర్యాదు మేరకు మృతురాలి ఫోన్ను పరిశీలించాం. అందులోని వాయిస్ రికార్డులో ప్రిన్సిపల్ రాజమణి, అసిస్టెంట్ కేర్ టేకర్ స్రవంతి, పీఈటీ రేష్మ, సహ ఉపాధ్యాయులు శిరీష, పుష్పలతల వేధింపుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తిరుమలేశ్వరి పేర్కొంది’ అని సీఐ తెలిపారు. ఈ మేరకు అయిదుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మృతురాలికి పదకొండేళ్ల కుమార్తె ఉందని వెల్లడించారు.