నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తై.. పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది. రోజుకో శాఖ ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చివరి రోజైన గురువారం రోజున తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరిపారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అమరజ్యోతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకొంది. 800 డ్రోన్ లు ఏకకాలంలో 15 నిమిషాల పాటు 13 ఆకృతులను ప్రదర్శించాయి. మరో 50 డ్రోన్లను స్టాండ్ బైగా సిద్దంగా ఉంచారు. తెలంగాణ అమరులు, కట్టడాలు, తొమ్మిదేళ్ళ ప్రగతిని కళ్ళకు కట్టేలా సచివాలయం ప్రాంగణం నుంచి సాగరతీరాన ప్రదర్శన సాగింది. దిల్లీ ఐఐటీ స్టార్టప్ తయారు చేసిన స్వదేశీ డ్రోన్ లతో బోట్ లాబ్ సంస్థ ఈ ప్రదర్శనను నిర్వహించింది.