‘ఏందయ్యా.. ఇది… నేనేడ జూళ్లే…’ నెల్లూరు యాసలో ఫేమస్ అయిన ఈ డైలాగ్ ఇప్పుడు వైరలవుతోంది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ను చేరుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ ఇదే డైలాగ్ను కొడుతున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్లో ఉండి, ఓ వెలుగు వెలిగిన ఆయన ఎమ్మెల్యే, మంత్రి పదవులను కూడా అనుభవించారు. ఆఖరికి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కూడా అధిరోహించారు. ఇప్పుడు ‘ముసలితనానికి దసరా పండుగ’ అన్నట్టు అధికార పార్టీ పంచన చేరటాన్ని కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు సాధారణ జనాలు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. ‘బీసీలకు హస్తం పార్టీలో అన్యాయం జరిగింది…’ అంటూ ఆయనెత్తుకున్న రాగాన్ని కూడా ఎవరూ వినిపించుకోవటం లేదు. అంటే మీకు టిక్కెట్ ఇస్తే.. బీసీలకు న్యాయం జరిగినట్టు, ఇవ్వకపోతే వారికి అన్యాయం జరిగినట్టా..? అంటూ నెటిజన్లు పొన్నాల మీద సెటైర్లు విసురుతున్నారు. మరి ఈ ప్రశ్నలకు మాజీ మంత్రి ఏం సమాధానం చెబుతారో..?
-కేఎన్ హరి