నవతెలంగాణ – అమరావతి
రాష్ట్రంలో రోజురోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కడో చోట హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, యాసిడ్ దాడి, పెట్రోల్ దాడులు అధికమవుతున్నాయి. మొన్న ఏలూరులో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా బాపట్ల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి బలైయ్యాడు. పదో తరగతి విద్యార్థి అమర్నాథ్పై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. ఉదయం ట్యూషన్కు వెళ్లొస్తుండగా బాలుడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరికొందరితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెంకి చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలులో ట్యూషన్కి వెళుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం వెళుతుండగా మార్గమధ్యలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరి కొందరితో కలిసి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల అంటుకొని బాలుడు హాహాకారాలు చేస్తుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే మంటలు ఆర్పి అతడిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తనపై వెంకటేశ్వర్రెడ్డి, మరికొందరు పెట్రోల్ పోసి నిప్పంటించారని మృతికి ముందు పోలీసులకు అమర్నాథ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.