నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్టైం రికార్డ్స్థాయికి చేరుకుంది. 45 ఏండ్ల తర్వాత బుధవారం.. నదిలో నీటిమట్టం 207 మీటర్లు దాటిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 7 గంటలకు నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం ఉన్నది. హర్యానాలో హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో ఉదయం 10 గంటల వరకు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం తెలిపింది. రాత్రి 11 గంటల వరకు 208.8 మీటర్లకు చేరుతుందని వెల్లడించింది. దీంతో రాజధానిలోని మొనస్టరీ మార్కెట్, యమునా బజార్, గర్హీ మండూ, గీతా ఘాట్, విశ్వకర్మ కాలనీ, ఖడ్డా కాలనీ, ఓల్డ్ రైల్వే బ్రిడ్జి సపీంలోని నీలీ ఛత్రి ఆలయం, నీమ్ కరోలి గోశాల, వజీరాబాద్ నుంచి మంజు కా టిలా రింగ్రోడ్డు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో గీతా కాలనీలోని రోడ్లను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 16,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.