నవతెలంగాణ- భువనగిరి రూరల్
భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించగా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సాయి ఫంక్షన్ హాల్ నుండి మొదలై అడుగడుగునా జన సంద్రాన్ని తలపిస్తూ అర్బన్ కాలనిలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ కుమార్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. వారితో పాటు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా కుంభం మాట్లాడుతూ ఇంత పెద్ద ర్యాలీతో నన్ను ఇక్కడిదాకా తీసుకు వచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసారు. దారి పొడుగునా ప్రజల ఆశీర్వాదం కనిపించిందని వారు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ హవా ఉందని 40 ఏళ్ళ చరిత్రను తిరగ రాయడానికి ఇంకో నలబై రోజులు మాత్రమే మిగిలి ఉందని ఈ సారి భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రెండు సార్లు కెసిఆర్ సర్కారుకి అవకాశం ఇస్తే అన్ని రకాల పథకాలని బీఆర్ఎస్ వాళ్ళకే కేటాయిస్తున్నారని ఇపుడు ఎన్నికలు రాగానే ప్రజలని మరొకసారి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారన్నారు.స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఏనాడు స్పందించలేదని అసెంబ్లీలో ఏ ఒక్క రోజు నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడలేదని, అలాంటి అసమర్ధ ఎమ్మెల్యేని ప్రజలు తిరస్కరిస్తు ఈ సారి మార్పు దిశగా ఆలోచిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణలో ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలని ప్రజలందరికి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.