నవతెలంగాణ-హైదరాబాద్ : పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తదన్నట్లు ఉంది కేటీఆర్ తీరు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రైతును రాజు చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొర గారు.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలన్నారు. “31 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు రాజులయ్యిండ్రా ? ఎరువులు ఫ్రీ అనే ఉత్తమాటలు చెప్పినందుకు రైతును రాజును చేసినట్లా? రూ.14 వేల కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొడితే రైతులు రాజులయ్యారా..? ముష్టి రూ.5 వేలు ఇచ్చి రూ.35 వేల సబ్సిడీ పథకాలు బంద్ పెడితే రైతును రాజు చేసినట్లా? 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి పట్టుమని 8 గంటలు ఇవ్వని పాలన రారాజు పాలన అంటారా? రైతు రాజైతే పదేండ్లలో 9 వేల మంది రైతుల చావులు ఎట్లా జరిగినయ్? వరి వేస్తే ఉరి అని చెప్పిన మీ దరిద్రపు పాలన ఆగమైన వ్యవసాయానికి ఆత్మహత్యలే శరణ్యమనడానికి నిదర్శనం. రుణాలు కట్టక రాజులు కాదు.. బ్యాంకుల దగ్గర మోసగాళ్లను చేశారు. మీ పాలన “రైతును రాజు చేసిన పాలన కాదు – రైతును రోడ్డుమీదకు” తెచ్చిన పాలన అని ట్వీట్ చేశారు షర్మిల.