నవతెలంగాణ – మయన్మార్
మయన్మార్లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. అయితే పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, రెండు రోజుల క్రితం పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ ప్రాంతంలో వరుసగా భూకంపాలు వచ్చాయి. ఈ నెల 19న న్యూ కలెడోనియాకు తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మరుసటి రోజే అంటే మే 20న ఉదయం అదే ప్రాంతంలో 7.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. సముద్ర ఉపరితలానికి 35 కిలోమీటర్ల లోతులో, న్యూ కలెడోనియన్ ద్వీపసమూహానికి తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. దీంతో సమీపంలోని వనౌతు, ఫిజీ, న్యూకలెడోనియా, కిరిబాటి, వాలిస్, ఫుటునా వంటి ద్వీప దేశాలకు సునామీ పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.