నవతెలంగాణ – ములుగు: ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధం ఉన్న అనుమానితులు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో శుక్రవారం ఉదయం 7 గంటలకు పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో పేరూరు ఎస్ఐ తన బృందంతో అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసిన కొరియర్ల గుంపు తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్కు చెందిన మడిని దేవదేవయ్య, పూజారి కాంకేర్ గ్రామానికి చెందిన కిక్కిడి హు అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకం ఉన్నారు. వీరిద్దరు పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను అమర్చినట్లు నిర్ధారించారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఓఎస్డీ అశోక్కుమార్, సీపీఎస్ సీఐ శివప్రసాద్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు, పేరూరు హరీశ్ పాల్గొన్నారు.