నవతెలంగాణ-హైదరాబాద్: నేడు,రేపు (ఈ నెల 16,17 తేదీల్లో) పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండలంలోని ఫలక్నుమా, చార్మినార్, మీర్చౌక్, బహదూర్పురా ట్రాఫిక్ పోలస్స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు. ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.