నవతెవలంగాణ- ఔరంగాబాద్ : మరాఠా కోటాపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్నాలో పరిస్థితి శనివారం అదుపులో వుంది. మొత్తంగా 360మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో హింసకు పాల్పడినట్లుగా భావిస్తున్న 16మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఔరంగాబాద్కు 75కిలోమీటర్ల దూరంలో అంబద్ తహసిల్లో అంతర్వాలి శరతి గ్రామంలో శుక్రవారం నాడు హింసకు పాల్పడిన అల్లరి మూకపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీలతో వారిని చెదరగొట్టారు. ఆ ఆందోళనల్లో నిరసనకారులతోపాటు కొంతమంది పోలీసులు, ఇతరులు గాయపడ్డారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జారంగె నేతృత్వంలో ఆందోళనకారులు మంగళవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. డాక్టర్ల సూచనపై జారంగెను ఆస్పత్రికి తరలించడానికి పోలీసులు ప్రయత్నించడంతో సమస్య మొదలైందని అధికారులు తెలిపారు. కొంతమంది వ్యక్తులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు, ప్రైవేటు వాహనాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆందోళన హింసాత్మకంగా మారిందని పోలీసులు తెలిపారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ అధికారులు దాన్ని ధృవీకరించలేదు. ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించేవరకు ఆందోళన కొనసాగిస్తామని నిరసన కారులు తెలిపారు. ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న మనోజ్ జారంగె విలేకర్లతో మాట్లాడుతూ, నిరాహార దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. మరాఠా రిజర్వేషన్పై ముఖ్యమంత్రి ఒక కమిటీని వేశారు. కానీ అది ఇంతవరకు నివేదిక అందచేయలేదని, అందువల్లే తాము ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తన చేతిలో బుల్లెట్ గాయాన్ని చూపిస్తూ, అమానుషంగా పోలీసులు లాఠీచార్జికి దిగారని అన్నారు. మహిళలపై కూడా చేయి చేసుకున్నారన్నారు. ‘మేమేమైనా పాకిస్తానీలమా లేక వారి బంధువులమా ? ఎందుకు కాల్పులు జరిపారు? మాకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు మేం ఆందోళన ఆపేది లేదు. ఎన్ని కావాలో అన్ని బుల్లెట్లు ముఖ్యమంత్రిని కాల్చుకోమనండి’ అని జారంగె పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా… గాల్లోకి కాల్పులు జరిపి, ఎందుకు లాఠీచార్జీ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 40మంది వరకు తమ సిబ్బంది, మరికొందరు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 15 ఆర్టిసి బస్సులు, కొన్ని ప్రైవేటు వాహనాలను తగలబెట్టారని అన్నారు. 360మందిపై గోండి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కోరారు. హింసపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.