నవతెలంగాణ – కర్ణాటక
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలు పోటీల్లో తన టీం రెండో స్థానానికే పరిమితమైనందుకు విచారంలో కూరుకుపోయిన ఓ బాలుడు ఆ తరువాత కాసేపటికే గుండెపోటుతో మరణించాడు. జిల్లాలో ఇటీవల వివిధ స్కూళ్ల మధ్య ఆటల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో భీమశంకర్ అనే విద్యార్థి తన టీంతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ టీం రెండో స్థానంలో నిలిచింది. దీంతో, విద్యార్థి విచారంలో కూరుకుపోయాడు. ఆ తరువాత కొన్ని నిమిషాలకే అతడు ఛాతిలో ఇబ్బందిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.