నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఉప్పు-నిప్పుగా ఉన్న కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక్కటై చేతులు కలిపారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని సీఎం కేసీఆర్.. కడియంకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్న రాజయ్య.. కడియంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ మనసు మార్చుకొని మళ్లీ తనకే టికెట్ ప్రకటిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు. దాంతో, రాజయ్య పార్టీ మారుతారన్న చర్చ జరిగింది. అయితే, రాజయ్యను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన మధ్యవర్తిత్వంతో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిరింది. రాజయ్యను ఆదుకుంటామని అధిష్ఠానం నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో, సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చిన కడియంను గెలిపించేందుకు సహకరిస్తానని రాజయ్య ప్రకటించారు. కడియం, రాజయ్య ఇద్దరు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కడియంకు రాజయ్య పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.