నవతెలంగాణ -నంద్యాల: నంద్యాల జిల్లా బండిఆత్మకూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యార్థులను బడికి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సు ముందు చక్రాల కమాన్కట్టలు విరిగిపోవడంతో అందులోని పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. బండిఆత్మకూరు చుట్టుపక్కలున్న వెంగళరెడ్డిపేట, కడమలకాల్వ, ఈర్నపాడు గ్రామాలకు చెందిన 40 మంది విద్యార్థులతో బస్సు పాఠశాలకు బయలు దేరింది. మార్గమధ్యలో దాని ముందు చక్రాల కమాన్ కట్టలు విరిగాయి. దీంతో ముందుభాగం రోడ్డును తాకి ఒక్కసారిగా ఆగిపోయింది. అసలే గుంతల రోడ్డు, ఆపై కాలం చెల్లిన బస్సు వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు.