నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్లోని సరన్ జిల్లాలో ఛప్రా నగరంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఓ మహిళ వింత బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ పిల్లల్లా కాకుండా, ఈ శిశువుకు 4 చేతులు , 4 కాళ్ళు ఉన్నాయి, ఇంకా తల కూడా వింత ఆకారంలో ఉంది. సోమవారం( జూన్ 12) అర్థరాత్రి జరిగిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది.అయితే పుట్టిన తర్వాత ఆ వింత శిశువు కొద్ది క్షణాల్లోనే(20 నిమిషాల్లోనే ) చనిపోయింది. ఛప్రా నగరంలోని శ్యామ్ చక్లోని ఓ నర్సింగ్హోమ్లో ప్రసూత ప్రియా దేవి అనే మహిళ ఈ వింత నవజాత బాలికకు జన్మనిచ్చింది. ఈ వింత శిశువును చూసేందుకు ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, రోగులు ఎగబడ్డారు. ఈ వింత అమ్మాయికి ఒక తల , నాలుగు చెవులు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు, రెండు గుండెలు, రెండు వెన్నెముక ఎముకలు ఉన్నాయి. పాప పుట్టిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెబుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం ఆపరేషన్ చేసి బాలికను బయటకు తీశారు. ఆ సమయంలో నవజాత శిశువు సజీవంగా ఉంది. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించింది. ఈ విషయమై ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. చాలా తక్కువ మందిలోనే ఇలా కనిపిస్తుందన్నారు. గర్భాశయంలోని ఒకే గుడ్డు నుండి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఇది జరుగుతుంది. వైద్య పరిభాషలో ఇలాంటి పిల్లలను కంజాయిన్డ్ ట్విన్స్ అంటారని వైద్యులు చెప్పారు . ఈ ప్రక్రియలో ఇద్దరూ సకాలంలో విడిపోతే, కవల పిల్లలు పుడతారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోలేరు, ఆ పరిస్థితిలో అలాంటి పిల్లలు పుడతారు అని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం ఉందని, పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. వారిని త్వరలోనే ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఇక ఇలాంటి వింతశిశువు పుట్టిందనే వార్త విని సిబ్బంది, ఇతర రోగులు ఆశ్చర్యానికి గురయ్యారు.