– ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు
– విలేఖరుల సమావేశంలో ఏఐసీసీ ప్రతినిధి అనిల్
నవతెలంగాణ- ఖమ్మం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివద్ధి అంతా గత ప్రభుత్వాలదేనని, తొమ్మిదిన్నర ఏండ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆల్ ఇండియా కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ తొమ్మిదిన్నర ఏండ్లుగా అధికారంలో ఉండి అభివృద్ధి చేసి ఉంటే నేడు వేలకు వేలు పెట్టి ప్రచారాలు చేసుకునే అవసరం ఉండేది కాదు కదా అని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, మా ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ చెప్పిన విధంగా కర్ణాటక వచ్చి అభివృద్ధి ఏంటో చూడాలని తెలిపారు. కాంగ్రెస్ అంటే ఒక్క కుటుంబానికో, ఒక్క సామాజిక వర్గానికో సంబంధించిన పార్టీ కాదన్నారు. అన్ని కులాల, మతాల సమ్మేళనంతో కూడిన పార్టీ అని అన్నారు. కర్ణాటక ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని, తెలంగాణ లో కూడా అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడులు చేసిన అభివృద్ధికి రంగులు అద్ది అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మనోహర్ నాయుడు, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంటెముక్కల నాగేశ్వరరావు, ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.