– పోడు ఉద్యమ నేత, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు పేదలందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద రైతులు అర్హులేనని పోడు ఉద్యమ నేత తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం అన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంజారా భవన్ పోడు భూముల సమస్య ప్రభుత్వం పరిష్కారం మార్గాలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ధరావత్ రామ్మూర్తి నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భూక్య వీరభద్రం, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బస్కినాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర రైతు అధ్యక్షులు బానోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ పోరాట ఫలితంగానే గిరిజలకు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా హక్కులు కల్పిస్తుందని అన్నారు. గత దశాబ్దాలుగా పోడు రైతులపై ప్రభుత్వాలు అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం శాస్త్రీయంగా పరిష్కరించాలని కోరారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి గిరిజన సంఘాలు ఐక్యంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు చంద్రం నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుశీల బారు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ కుమార్, తేజావత్ కృష్ణకాంత్, తెలంగాణ గిరిజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అజ్మీర కిషన్ నాయక్, మహిళా విభాగం అధ్యక్షురాలు బానోతు తార దేవి, మోతిలాల్ నాయక్, తేజావత్ అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.