– మహిళా సాధికారతపై మోడీ చెప్పిందానికి చేసేదానికి పొంతన లేదు
– 9 ఏండ్ల పాలనలోఇదీ తీరు..
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకుంటున్న నవ భారతంలో గత నెల రెండు కీలక ఘట్టాలు జరిగాయి. మే 28న మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి మఠాధిపతులు, పీఠాధిపతులతో ఉల్లాసంగా గడిపారు. అదే పార్లెమంట్కు రెండు కిలోమీటర్ల దూరంలో ‘మాకు న్యాయం చేయండి మహాప్రభో’అని రెండు నెలలుగా నెత్తీ నోరు మొత్తుకుంటున్న రెజ్లర్లపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. మహిళలు అని కూడా చూడకుండా దేశానికి పతకాలు సాధించిన వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ వంటివారిని ఊపిరాడకుండా బంధించి వారిని పోలీసు వాహనాల్లోకి ఈడ్చి పడేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం..’ సాధారణంగా కొత్తగా ఎన్నికలలో గెలిచి గద్దెనెక్కే ఏ ప్రభుత్వమైనా చెప్పే మాట ఇదే. దీనికి ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా మినహాయింపు కాదు. 2014లో అధికారం చేపట్టినప్పుడు మహిళల సాధికారతపై, దేశంలో మహిళలపై పెట్రేగిపోతున్న అరాచకాలపై బీజేపీ సోషల్ మీడియాతో పాటు సొసైటీలోనూ గగ్గోలు పెట్టింది. తాము అధికారంలో ఉంటే మహిళలపై నేరాలకు పాల్పడుతున్నవారికి సరైన బుద్ది చెబుతామని, నేర సామ్రాజ్యంలేని రాజ్యాన్ని తీసుకొస్తామని నీతులు చెప్పింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి మహిళలకు చేయూతగా ఉంటామని హామీ ఇచ్చింది. కానీ ఈ 9 ఏండ్లలో అవన్నీ జరిగాయా..?
ఆది నుంచీ అదే తీరు..
నరేంద్ర మోడీ – అమిత్ షా నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు మహిళలపై ఆది నుంచీ అణిచివేత ధోరణినే అవలంభిస్తున్నది. హిందూత్వ, పితృస్వామ్య భావజాలాన్ని నరనరాన ఇమిడించుకున్న బీజేపీ పాలకులు.. ‘నారీ శక్తి’, ‘బేటీ బచావో, బేటీ పడావో’ వంటి నినాదాలను నినాదాలకే పరిమితం చేశారు. మహిళలు తమ హక్కుల కోసం రోడ్డెక్కితే మాత్రం వారిపై దయా దాక్షిణ్యాలు లేకుండా వ్యవహరిస్తున్నారు. 2019 లో జరిగిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఎఎ) – నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) నుంచి రైతుల మహోధ్యమం వరకూ అణిచివేతే మోడీ సర్కారు ప్రధానాస్త్రం అయింది. తాజగా రెజ్లర్లపై జరిగిన ఘటన దానికి కొనసాగింపు..
నేరాలు తగ్గాయా..?
2014కు ముందు దేశంలో జరిగిన నిర్భయ తరహా ఉదంతాలలో ప్రస్తుత పాలకులు రోడ్ల మీదకు వచ్చి కాంగ్రెస్ పాలనలో నేరాలు పెరిగిపోయాయని తాము అధికారంలోకి వస్తే వాటిని నియంత్రిస్తామని ఊదరగొట్టారు. కానీ ఒకసారి గణాంకాలను పరిశీలిస్తే అవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలే అనిపించకమానదు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2012లో దేశంలో మహిళలపై 2.44 లక్షల నేరాలు నమోదయ్యాయి. 2021లో ఇది 4.28 లక్షలకు చేరింది. అంటే ఘనత వహించిన మోడీ 9 ఏండ్ల పాలనలో మహిళలపై నేరాలు 42.96 శాతం పెరిగాయి. 2012లో ఒక లక్ష మంది మహిళలకు గాను 41.74 మందిపై నేరస్తులు నేరాలకు పాల్పడితే 2021లో అది 64.5 కు చేరింది.
రాజకీయ, ఆర్థిక సాధికారత..
భారత శ్రామిక శక్తిలో మహిళల పాత్ర కీలకం. ముఖ్యంగా అసంఘటితరంగంలో వారి వాటా అధికంగా ఉంటుంది. దశాబ్దాలుగా క్షీణిస్తూ వస్తున్న భారత మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎఫ్ఎల్ఎఫ్పీఆర్) గత తొమ్మిదేండ్లలలో గణనీయంగా తగ్గింది. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. 2012లో ఎఫ్ఎల్ఎఫ్పీఆర్ 27 శాతంగా ఉండగా.. 2021లో అది 22.9 శాతానికి క్షీణించింది. ఇక అంతో ఇంతో గ్రామీణ మహిళలకు అండగా ఉంటున్న ఆశా, అంగన్వాడీ వంటి వాటిలో జీతాలు సరిగా లేక చాలా మంది వాటికి కూడా స్వస్తి పలుకుతున్నారు. కోవిడ్ – 19 సంక్షోభం, దేశంలో ముంచుకొస్తున్న మందగమనంతో గడిచిన రెండేండ్లలో చాలా మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. గ్రామీణ మహిళలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ (MGNREGA)కి కూడా మోడీ ప్రభుత్వం నిధుల కోత విధిస్తూ చాలామందిని బలవంతంగా పనిమాన్పించిన ఆరోపణలున్నాయి. ఇక రాజకీయ రంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నది కలగానే మిగిలపోతోంది. కాంగ్రెస్ హయాంలో దీనిపై నానా రచ్చ చేసిన బీజేపీ నాయకులు అధికారంలోకి రాగానే ఆ ఊసే మరిచిపోయారు. మహిళలకు సీట్లను కేటాయించడంలో అన్ని పార్టీలూ ఆ తాను ముక్కలే అయినా బీజేపీ మాత్రం ఇందుకు పరాకాష్ట. 2014లో 16వ లోక్సభకు ఎన్నికైన ఎంపీలలో 11 శాతమే మహిళలు. 17వ పార్లమెంట్ లో ఇది 12.45 శాతానికి మాత్రమే చేరింది. బీజేపీ నుంచి 2014లో పార్లమెంట్ కు పోటీచేసినవారిలో 8 శాతం మంది మహిళలు ఉండగా 2019 లో అది 12 శాతమే.
సంక్షేమం..
కేంద్ర ప్రభుత్వంతో పాటు నరేంద్ర మోడీ తన ట్విటర్ ఖాతాలో గొప్పలు చెప్పుకునే పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై). దీని కింద కేంద్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్లను అందజేస్తున్నది. 2023 గణాంకాల ప్రకారం.. కేంద్రం 96 మిలియన్ల (9.6 కోట్లు) గ్యాస్ కనెక్షన్లను ఇచ్చింది. ఒక నివేదిక ప్రకారం ఇందులో 9.6 శాతం లబ్దిదారులు ఒక్కసారి సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్లీ రిఫిల్ బుక్ చేయలేదు. 11.6 శాతం మంది ఒక్కటే తీసుకోగా 56.5 శాతం మంది ఏడాదికి నాలుగు సిలిండర్స్ ఆర్డర్ ఇస్తున్నారు. దీనికి కారణం ఒక్కటే.. మోడీ అధికారంలోకి రాకముందు 2014లో గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ. 410. ఇప్పుడు అది రూ. 1,150 రూపాయలకు చేరింది. నలుగురు కుటుంబసభ్యులు ఉండే ఒక ఇంట్లో ఎంత కొసరి కొసరి వండుకున్నా ఏడాదికి ఏడు సిలిండర్లు అవసరం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎంయూవై పథకంలో లబ్దిదారులు చాలామంది దినసరి కూలీలే. వీరికి పని దొరక్కుంటే పూట గడవడమే కష్టమనుకుంటే నెలన్నరకు సుమారు రూ.1200 పెట్టి సిలిండర్ కొనగలిగే స్థోమత ఉందా..?
ఇక లబ్దిదారులకు అందించే రాయితీ, ఇతర ప్రయోజనాల సంగతి దేవుడెరుగు. ఒకప్పుడు సిలిండర్ బుక్ చేస్తే రూ. 500 ప్రజలు చెల్లిస్తే అందులో సగం అయినా తిరిగి వారి ఖాతాల్లో చేరేది. ఇప్పుడు రూ. 1,150 పెట్టి సిలిండర్ బుక్ చేస్తే లబ్దిదారుల ఖాతాల్లో జమయ్యేది రూ. 50 లకు మించడం లేదు. పీఎంయూవై పథకం కింద సిలిండర్లు పొందుతున్నవారిలో అయితే 13 శాతం మందికి ఇంతవరకూ ఒక్కసారి కూడా రాయితీ అందలేదని ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారంలో తేలింది. 23 శాతం మందికి అసలు రాయితీ అనేది ఒకటి ఉందనే విషయం గురించి కూడా అవగాహన లేదట..!