నవతెలంగాణ న్యూఢిల్లీ : రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ల చెల్లింపులకు రూ.2,000 నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం గానీ లేదా మార్చుకునేందుకుగానీ ఈ నెల 30తో గడువు ముగుస్తోంది.రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో వీటిని చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఉపసంహరణ నేపథ్యంలో సెప్టెంబరు 1 నాటికి 90 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల తెలిపారు. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. తిరిగొచ్చిన రూ.2,000 నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు చెప్పారు.