నవతెలంగాణ – హైదరాబాద్
ఎన్నికల సంఘం ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్) ద్వారా ఓటరు జాబితా సవరిస్తుంది. ఇందులో భాగంగా నవంబర్ నెలలో ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించి జనవరి 5న తుది జాబితాను విడుదల చేస్తుంది. కానీ ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడం వల్ల రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనున్నది. ఇందులో భాగంగా ఇంటింటా సర్వేతో పాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి ఓటరు జాబితాలో సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 25 నుంచి జూన్ 23 వరకు బీఎల్వోలు ఇంటింటా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయిస్తారు. అదే విధంగా రెండు ఓట్లు ఉన్నవారిని, చనిపోయిన వారిని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి వారిని తొలగించి ఓటరు జాబితాలో సవరణలు ఉంటే చేసే విధంగా ఓటర్లు అవగాహన కల్పిస్తారు.