నవతెలంగాణ – అమరావతి: ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నారు. 17 నుంచి 30 వరకూ దశలవారీగా శాంతియుత ఉద్యమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం అనంతపురంలో మీడియాకు తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బొప్పరాజు విమర్శించారు. ఉద్యోగులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.