– బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్కు వచ్చే రోజుల్లో పుట్టగతులుండబోవని కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చింతల్ డివిజన్ పరిధిలోని శివానగర్, శ్రీ సాయి కాలనీ, రంగానగర్, సాగర్ రెసిడెన్సి అపార్ట్మెంట్స్, సిరీ టవర్స్లో బీజేపీ రాష్ట్ర నాయకులు రాజా కొట్టే సదానంద్, బీజేపీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తూ కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, ద్వితీయ శ్రేణి నాయకులు అందిన కాడికి దండుకొని పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ కోటపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం భగత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కూన సమక్షంలో బీజేపీలో చేరారు.