నవతెలంగాణ – సూర్యాపేట
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల్లో సీఎం కేటీఆర్ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. 50 ఏండ్లు అవకాశం ఇస్తే ఏం చేశారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లాకు చెందిన చాలా మంది మంత్రులుగా పనిచేశారు.. సూర్యాపేటను ఏమైన అభివృద్ధి చేశారా? సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా? సూర్యాపేట, నల్గొండ జిల్లాలు గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి. ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు. ప్రజలు ఆగం కావొద్దు. కాంగ్రెస్ నేతలు రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెబుతున్నరు. వాళ్లు పరిపాలిస్తున్న ఛత్తీస్గఢ్లో అంత పెన్షన్ ఇస్తున్నరా? కర్ణాటకలో ఇస్తున్నారా? రాజస్థాన్లో ఇస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ఓ నీతి ఉంటుందా? అంటే ఏమన్నట్టు? నాకు నోరు లేదా? నాకు చెప్పరాదా? వాళ్లు నాలుగిస్తే.. నేను రూ.5 ఇస్తా అని అనరాదా? ఇదేమైనా అర్రాస్ పాటనా? కాదు కదా? బాధ్యతతో బ్రహ్మాండంగా తీసుకెళ్లాలి. అన్నీ రావాలి. అన్ని కలగాలి. తప్పకుండా మనం కూడా పెన్షన్ పెంచుదాం. ప్రకటిస్తా ముందు ముందు. ‘ అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో అంచెలంచెలుగా సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నాం. ఒక పార్టీ నాయకుడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు.. మరో పార్టీ నాయకుడేమో 3 గంటల కరెంటు చాలంటాడు. కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలో అప్పుడే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. నేడు తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలు సరిపోవట్లేదు. కాంగ్రెస్ ఆపద్బంధు పథకం, బీఆర్ఎస్ రైతు బీమాను పోల్చి చూడాలి. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతు బంధు, రైతు బీమా డబ్బు ఖాతాలో పడుతోంది. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ధరణి పోర్టల్ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుంది. ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మొనగాడు ఉన్నారా? మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయ్యేలా ధరణి తెచ్చాం. ఓటు అనే ఆయుధాన్ని బాగా ఆలోచించి వాడుకోవాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు భారాస గెలవాలి. భారాస విజయంపై అనుమానమే లేదు. గత ఎన్నికలకంటే ఈసారి ఐదారు సీట్లు ఏక్కువే వస్తాయి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేటకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ‘‘ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు చేస్తున్నా. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభవన్ నిర్మిస్తాం. సూర్యాపేటలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నిర్మించాలని మంత్రి ప్రశాంత్రెడ్డిని ఆదేశిస్తున్నా’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.