నవతెలంగాణ – జనగామ కలెక్టరేట్ : జిల్లాలోని బమ్మెర, జాఫర్ఘడ్ టూరిజం ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మిని సమావేశ మందిరంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు, సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టూరిజం ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, అందులో భాగంగానే పాలకుర్తి, వల్మిడి, బమ్మెన, జాఫర్ఘఢ్ తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ది చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ద్వారా పనులు నిర్వహిస్తున్నామని చెప్పారు. బమ్మెర, జాఫర్ఘడ్లలో అంతర్గత రోడ్లు, వసతి గృహాలు, మెట్లు, కొండపై గుండం తదితర అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని చెప్పారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ తనకు నివేదిక అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాట శాఖ అధికారి గోపాల్ రావు, ఆర్ అండ్ బి ఈఈ హుస్సేన్, పురావస్తు శాఖ అధికారి నరసింహ నాయక్, సంబంధిత కాంట్రాక్టర్లు, సిబ్బంద పాల్గొన్నారు.