– అక్రమార్కులపై ఉక్కు పాదం మోపేనా..!
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిఓ నెంబర్ 59 ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ప్లాట్లు పొందిన కొందరు లబ్ధిదారులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం విచారించనున్నారు. ఇప్పటికే సంబంధిత లబ్ధిదారులకు నోటీసు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సంబంధిత లబ్ధిదారులు నేడు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని జెసి చాంబర్ వద్ద జరగనున్న విచారణకు హాజరు కావాల్సి ఉంది. లబ్ధిదారులతోపాటు బినామీలు కూడా హాజరు కానున్నట్లు తెలిసింది. అయితే అక్రమంగా ప్లాట్లను పొందిన లబ్ధిదారులు ఒకవేళ గైర్హాజరైనా కూడా వెంటనే అదికారులు ప్లాట్ల రద్దుకు సిఫార్సు చేయనున్నారని సమాచారం. ఇది ఇలా ఉంటే మరొపక్క జర్నలిస్టు మిత్రులంతా శుక్రవారం ఉదయమే 10.30 గంటలకు కలెక్టరేట్ కు రావాలని హౌసింగ్ సొసైటీ పిలుపునిచ్చింది. అదే రోజు సాయంత్రం అక్రమంగా ప్లాట్లు పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా అధికారులు, జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అక్రమ ప్లాట్లు వ్యవహారం విచారణకు వచ్చిందని, అయితే ప్లాట్లను రద్దు చేస్తూ, అక్రమంగా ప్లాట్లు పొందిన లబ్ధిదారులపై అధికారులు ఏ మేరెకు చర్యలు తీసుకుంటారో అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.