– పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్కు హైకోర్టులో ఊరట లభించింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఈ నెల 12 న కాగజ్ నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బీఎస్పీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరుని ఫిర్యాదు మేరకు ఆయనతో సహా 16 మందిపై హత్యాయత్నంతో పాటు దొంగతనం కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు జిల్లా ఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తూ బీఎస్పీ ర్యాలీలకు పర్మిషన్ల పేరుతో అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించడంతో కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు పార్టీ శ్రేణులతో కలిసి ప్రవీణ్కుమార్ అర్థరాత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అక్రమ కేసులపై హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేయగా గురువారం ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.