– జార్ఖండ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
రాంచీ : మోడీ ఇంటి పేరు కేసులో తదుపరి నోటీసులు ఇచ్చేవరకూ కాంగ్రెస్ నాయకులు రాహుల్గాంధీపై ఎలాంటి బలవంతపు చర్యలూ తీసుకోవద్దని జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. 2018లో ప్రధానమంత్రి మోడీ ఇంటిపేరుపై, అప్పటి బిజెపి అధ్యక్షులపై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాంచీ సివిల్ కోర్టుతో సహా, జార్ఖండ్లోని వివిధ కోర్టుల్లో బిజెపి నాయకులు పిటీషన్లు వేశారు. వీటిపై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, మరోవైపు 2019 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ గాంధీపై గుజరాత్లో కేసు నమోదయింది. ఈ కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను కూడా విధించింది. దీంతో రాహుల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పుపై గుజరాత్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.