నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : ఎన్నికల సమయంలో మైనార్టీలకు తాయిలాలు ప్రకటిస్తున్న పార్టీల కు ఓటు వేయవద్దని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శాలివాహన పండరినాథ్ గ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ గారు, బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ యు. శివరాములు పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇతర మతాలకు తాయిలాలు ప్రకటిస్తున్న పార్టీలు ఒక వర్గాన్ని చిన్న చూపు చూస్తే సహించేదిలేదని విశ్వహిందు పరిషత్ హెచ్చరిస్తుంది అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర మతాలను బుజ్జగిస్తున్న పార్టీలకు హిందువుల పట్ల చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. హిందువులు కూడా ఓటర్లన్న సంగతి తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కరు తమ వద్దకు వచ్చే నాయకునికి ప్రశ్నించాలని పిలుపునిచ్చింది. తమ వద్దకు వచ్చిన నాయకునికి ఏపార్టీ నాయకుడైనా దేవాలయాల రక్షణ, లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిల రక్షణ, గోహత్యా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలందరికీ విద్య, వైద్యంలను ఉచితంగా అందించే విధంగా మరియు వృద్ధులకు, వికలాంగులకు చేయూత, రైతులకు భరోసా ఇస్తూ యువతకు ఉద్యోగ భద్రత కల్పించిన వారికే మా ఓటు వేస్తామని నాయకులను ప్రశ్నించాలని కోరారు.