– జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రప్రభుత్వం మహిళాబిల్లు తేవడం అభినందించదగిందని, ఓబీసీ మహిళలకు సబ్ రిజర్వేషన్లు ఇవ్వకపోవడం మాత్రం తీవ్రమైన అన్యాయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. దేశంలో సగానికి పైగా ఉన్న ఓబీసీల జనగణన చేయాలని, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా 75 ఏళ్ళుగా ఉన్న డిమాండును పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తే బహుజనులు ఉద్యమాలు చేయక తప్పదని తెలిపారు. హయత్ నగర్ విశ్వకర్మమనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు జరిగిన సభలో జూలూరు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వెల్లివిరుస్తున్న సాంకేతిక పరిజ్ఙానాన్ని చేతివృత్తులకు అందించి బహుజనుల జీవన ప్రమాణాలు పెంచాలనే దార్శనిక ఆలోచనలున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల చేతివృత్తులకు భరోసా లభించే కాలం వచ్చిందని అన్నారు. చేతివృత్తుల్లో కొనసాగుతున్న వారి జీవనప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం లక్ష రూపాయల రాయితీ స్వచ్ఛందంగా అందజేస్తోందని తెలిపారు. ఈ రకమైన సౌకర్యం దేశంలో మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వకర్మలకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చి ఆత్మగౌరవ భవననిర్మాణాన్ని కూడా రాష్ట్రప్రభుత్వమే భుజస్కంధాలపై వేసుకుని నిర్మిస్తుందని జూలూరు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు ఉపేంద్ర మాట్లాడుతూ విశ్వకర్మలు ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలిపారు. సృష్టికర్తలుగా కీర్తించబడుతున్న విశ్వకర్మల చేతివృత్తులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి జీవనప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సింహాద్రి చారి, పద్మనాభ చారి, లింగాచారి, కృష్ణమాచారి, రామాచారి, విష్ణు చారి, శ్రీనివాసచారి, సత్యం చారి, దయానంద చారి పాల్గొన్నారు