జైపుర్‌లో భూకంపం…

Earthquakeనవతెలంగాణ – జైపుర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈ భూకంపం గురించి ట్విటర్‌ వేదికగా స్పందించారు. జైపుర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సైతం భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోని నొగోపాలో సైతం 3.6 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.