నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ కేసులో అమెరికా మిలియనీర్ నెవిల్లే రారు సింగంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. న్యూస్క్లిక్ కు వ్యతిరేకంగా అమెరికా పత్రికలు రాసిన కథనాలు వల్ల కేసు నమోదు చేసి, సోదాలు చేపట్టిన ఈడీ.. కొన్ని ఆస్తులను జప్తు చేసింది. తాజాగా మనీలాండరింగ్ చట్టం కింద భారత విదేశాంగ శాఖతో చైనాలోని షాంఘైలో ఉన్న నెవిల్లే రారు సింగంకు నోటీసులు పంపింది. ఆయన వాదనలు రికార్డు చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. న్యూస్క్లిక్ వివాదంలో తనపై వచ్చిన ఆరోపణలను నెవిల్లే ఇప్పటికే ఖండించారు. చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో 2021 సెప్టెంబరులో ఢిల్లీలోని న్యూస్క్లిక్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. అనంతరం న్యూస్క్లిక్ ఎడిటర్- ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ సహా 25 మంది వాంగూల్మాన్ని నమోదు చేసింది. రెండు నెలల క్రితం ఈడీ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. అనంతరం ప్రబీర్ ను అరెస్టు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్) నిబంధనలను ఉల్లంఘించిందని సీబీఐ కేసు నమోదు చేసి ప్రబీర్ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి ఆస్తులను జప్తు చేసింది. అక్రమ అరెస్టు, కేసులు కొట్టివేయాలని ప్రబీర్ పుర్కాయస్థ దాఖలు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.