– ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలు విధానాల రూపకల్పనపై..
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలకు సంబంధించి విధానాలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఎనిమిది వారాల సమయం ఇచ్చింది. ఈ పిటీషన్ ఐదేళ్లకు పైగా కొనసాగుతోందని, కాబట్టి ఇదే అఖరి అవకాశమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. అలాగే, నిర్ణీత వ్యవధిలోగా పాలసీని రూపొందించకపోతే, ఈ అంశాన్ని (ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలకు సంబంధించి విధానాలు రూపొందించే) నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి తదుపరి విచారణలో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 4కు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ పిటీషన్ విచారణ ఐదేళ్లకు పైగా కొనసాగుతోంది, కాబట్టి విధానాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి తగినంత వ్యవధి లభించింది కాబట్టి కేంద్రానికి చివరి అవకాశంగా ఎనిమిదివారాల సమయం ఇస్తున్నాం’ అని గురువారం ఉత్తర్వుల్లో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మిని పుష్కర్ణతో కూడిన ధర్మాసనం జారీ చేసింది. ఆన్లైన్లో ‘చట్ట విరుద్దమైన’ ఔషధాల విక్రయాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2018 ఆగస్టులో ప్రచురించి ముసాయిదాను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను కూడా కోర్టు విచారిస్తోంది.ఆన్లైన్లో ఔషధాల విక్రయాలను నియంత్రించే సరైన నిబంధనలు లేనందున, ప్రజల ఆరోగ్యం, జీవితాల ప్రమాదంలో పడతాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవితం హక్కుపై ప్రభావితం చూపిస్తుందని పిటీషన్దారులు తెలిపారు. ఇప్పటికే ప్రతిరోజూ లక్షలాది మందులు ఇంటర్నెట్లో అమ్ముడవుతున్నాయని, వీటిల్లో కొన్ని మందులు/ఔషధాల్లో నార్కోటిక్, సైకోట్రోపిక్ పదార్థాలు ఉంటున్నాయని, ఇవి రోగికి మాత్రమే కాకుండా యావత్తు మానవాళికి ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు.