తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మండు వేసవిలో సైతం చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయనీ, చివరి ఆయకట్టుకు సైతం ప్రభుత్వం సాగునీరు అందిస్తున్న తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో బీటలువారిన చెరువులు నేడు నడి ఎండకాలంలో మత్తడులు దుంకుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ మాగాణం అయిందనీ, అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతేనని వివరించారు. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైందన్నారు. 2004 నుండి 2014 వరకు పదేండ్లలో తెలంగాణ ప్రాజెక్టులపై ఉమ్మడి సర్కారు కేవలం రూ.38,405.2 కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో ఇక్కడి ప్రాజెక్టులపై వెచ్చించిన మొత్తం రూ.1.69 లక్షల కోట్లని వివరించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సాయం చేయకున్నా సరే రాష్ట్రసర్కార్ అంకుఠిత దీక్షతో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తోందని పేర్కొన్నారు.
75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగు విస్తీర్ణ శాతం 7.7 శాతం కాగా, 9 ఏండ్లలో తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం 117 శాతమని తెలిపారు. సగటుభూగర్భ జల మట్టం 4.14 మీటర్లకు పెరిగిందని పేర్కొన్నారు.