నవతెలంగాణ – హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఐపీఎల్లో గాయపడి కోలుకున్న కేన్ విలియమ్సన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. విలియమ్సన్, టిమ్ సౌథీ నాలుగో ప్రపంచకప్ ఆడనున్నారు. మార్క్ చాప్మన్, డెవోన్ కాన్వే, డరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్ తొలిసారి ప్రపంచకప్ ఆడబోతున్నారు. ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్, టాపార్డర్ బ్యాటర్ హెన్రీ నికోలస్కు జట్టులో చోటు దక్కలేదు. న్యూజిలాండ్ ఈసారి తమ జట్టును వినూత్నంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ముందుగానే ఎక్స్ ద్వారా వెల్లడించింది. తమ ప్రపంచకప్ జట్టును వారి నంబర్ వన్ ఫ్యాన్సే పరిచయం చేస్తారని పేర్కొంటూ ఎక్స్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు పేర్లు చదివి వినిపించారు. విలియమ్సన్ కుటుంబం, ట్రెంట్ బౌల్ట్ కుమారులు, రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు, జిమ్మీ నీషమ్ నానమ్మ.. తదితరులు ఆటగాళ్ల జెర్నీ నంబర్లు చదివి శుభాకాంక్షలు చెప్పారు.
కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవోన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మట్ హెన్రీ, టామ్ లాథమ్, డరిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, విల్ యంగ్