నవతెలంగాణ – కేరళ: కేరళలోని కోజికోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు వెలుగులోకి వచ్చాయి. నిపా వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు కేరళ ఆరోగ్య శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రోజున వైద్యాధికారులతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. సమీక్ష చేపట్టారు. అనంతరం ఘటనకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. మృతుల బంధువు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఈ మరణాలకు గల కారణాలను అన్వేషించేందుకు కేరళ సర్కార్ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది . మంగళవారం మధ్యాహ్నం దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం రానుంది. మొదటి మరణం ఆగస్టు 30న సంభవించిందని అధికారులు తెలిపారు. నిపా వైరస్ కలకలంతో ఆ రాష్ట్ర ప్రజలు అప్రమత్తమయ్యారు.