నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం ఉప్పాడ గ్రామానికి చెందిన మైలిపల్లి అప్పారావు రేకుల షెడ్డులో కొందరు మత్స్యకారులు చేపల వలలు అక్కడ ఉంచుతూ ఉంటారని అదే ప్రదేశంలో కొందరు ద్విచక్ర వాహనాలు కూడా అక్కడే నిలుపుదల చేస్తూ ఉంటారు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి రేకుల షెడ్డులో ఉన్న వలలు, మూడు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు రావడంతో గమనించిన స్థానిక మత్స్యకారులు పిఠాపురం అగ్నిమాపక సిబ్బందికి, స్థానిక సర్పంచుకు సమాచారం అందచేయడంతో హుటా హుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ద్విచక్ర వాహనాలు, వలలు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. ప్రమాదం షార్ట్ సర్క్యూట మరి ఏదైనా కారణమా వల్ల జరిగిందా అనే కోణాల్లో అగ్నికిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారుగా 14 లక్షల పైబడి నష్టం వాటిల్లినట్లు స్థానిక మత్స్యకారులు తెలుపుతున్నారు.