– నేడు మణుగూరులో రోడ్ షో..
– పర్యటన విజయవంతంపై కాంగ్రెస్ దృష్టి
నవతెలంగాణ -బూర్గంపాడు/మణుగూరు
మన్యం ప్రాంతమైన మణుగూరులో తొలిసారిగా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పినపాక నియోజకవర్గం విజయాన్ని కాంక్షిస్తూ మణుగూరులో శుక్రవారం రోడ్ షో, కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా బూర్గంపాడు, పినపాక, అశ్వాపురం, మణుగూరు, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల తదితర మండలాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఆయా మండలాల పార్టీ నాయకులు దృష్టి సారించి ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మణు గూరుకు చేరుకొని రాహుల్ గాంధీ గంట సేపు మణుగూరు ప్రాంతంలో జరిగే రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో- కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ చౌదరి, ముఖ్య రాష్ట్ర నాయకులు, సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాల పార్టీ ఇన్చార్జిలు, బాధ్యులు, జన సమీకరణ పై దృష్టి సారించిన విజయవంతం చేయాలని సన్నహాల్లో నిమగమ య్యారు.