– పశువుల మేతకోసం వదలిన 30 వేల ఎకరాలు
– వారబందీతో నెర్రెలు బారిన సాగు భూములు
– మిర్చి, వరి, మినుములకు బారీ నష్టం
– ఎకరా వరికి రూ.45 వేలు, మిర్చికి రూ.80 వేలు
– చేతికి రాకుండానే కుల్లారిన పంటలు
– ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
చిన్నంబావి మండలం కాలూరు గ్రామానికి చెందిన చిన్న కురుమూర్తి తనకున్న 5ఎకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగుచేశాడు. 5 ఎకరాల్లో మినుము, మరో ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. వాటి పెట్టుబడికి రూ. 2 లక్షలు కాగా, పొలం కౌలు రూ.లక్ష అయింది. కాగా, సాగునీరు రాక పంట పూర్తిగా ఎండిపోయింది. పంట చేతికి వస్తే.. అప్పులు తీరుతాయనుకుంటే కొత్త అప్పు అయ్యిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.వెల్లూరు గ్రామానికి చెందిన రైతు తిరుపతయ్య మూడు ఎకరాల్లో వరి, ఐదు ఎకరాల్లో మక్క పంటను సాగు చేశారు. ఎకరాకు రూ. 40 వేల ఖర్చు అయింది. కాగా, సాగునీరు అందక వేసిన పంట పూర్తిగా ఎండిపోవడంతో పశవులకు వదలిపెట్టారు. పొట్టలో కంకి పెట్టుకొని.. మరికొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో జూరాల నుంచి చివరి ఆయకట్టుకు సాగు నీరు ఆగిపోయాయి. వారబందీతో మొదటి పొలాలకు మాత్రమే సాగునీరు అందడంతో చివరి పంట పొలాలకు నీళ్లు లేక నెర్రెలు బారి ఎండిపోయాయి. దాంతో వరి, మిర్చి, మినుము పంటలను పశువులకు వదలిపెట్టారు. ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ.లక్షల్లో ఖర్చు చేసిన రైతులకు అప్పులు మిగిలాయి. సాగునీటి అధికారుల మాటలు నమ్మి సాగు చేసిన రైతులకు పరిహారం అందివ్వాలని రైతులు, రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. జూరాల చివరి ఆయకట్టు అయిన పెంట్లవెల్లి, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్, పెబ్బేర్ తదితర మండలాలకు సాగునీరు అందడం లేదు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి నెలకొన్నది. పంట చేతికి వచ్చే దశలో నీరు నిలిపేయడం వల్ల వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారమే 30 వేల వరి, మిర్చి, మినుము, పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రధానంగా చిన్నంబావి మండల పరిధిలోనే ఎల్లూరు, చిన్నమరూరు, పెద్దమరూరు, అయ్యవారిపల్లి, కాలూరు, చెల్లెపాడు, కొప్పునూరు తదితర గ్రామాల పరిధిలోనే 10 వేల ఎకరాలు ఎండిపోయింది. కొప్పునూరు గ్రామానికి చెందిన కత్తి తిరుపతయ్య తనకున్న మూడు ఎకరాల్లో వరి, మినుములు సాగు చేశారు. ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి అయింది. అదే గ్రామానికి చెందిన జయన్న మూడు ఎకరాలు, రైతు శ్రీనుకు చెందిన 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. వెల్లూరు గ్రామానికి చెందిన మద్దిలేటి ఐదు ఎకరాలలో వరి 14 ఎకరాలలో మినుము, 3 ఎకరాలలో మక్క పంట సాగు చేశారు. నీళ్లు ఆగిపోవడంతో పంట పూర్తిగా ఎండి పోయింది. సాగునీటి అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సాగు చేశామని, కానీ మొదటి ఆయకట్టుకు నీరు వదలి చివరి ఆయకట్టు భూములకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటలకు అధికారులే బాధ్యత వహించాలని రైతులు అంటున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని పలు రైతు సంఘాలు కోరుతున్నాయి.
14 ఎకరాలు పూర్తిగా ఎండింది
14 ఎకరాల్లో వరి, మినుము పంటలను సాగు చేశాను. వరి ఎకరాకు రూ.45 వేలు, మినుముకు రూ.40 వేలు ఖర్చు అయింది. ఇంకా కౌలు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాను. ఇంత ఖర్చు చేసి సాగు చేసినా నీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయి.
– కురుమయ్య కాలూరు,
చిన్నంబావి, వనపర్తి జిల్లా
మమ్ములను ఆదుకోవాలి..
లేకుంటే మరణమే శరణ్యం
చివరి ఆయకట్టుకు సాగునీరు అందక ప్రతి ఏటా ఇదే పరస్థితి నెలకొంటుంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరో 10 రోజులు పోతే ఎండిన ఆనవాళ్లు లేకుండా పోతాయి. ఇప్పటికైనా ఎండిపోయిన పంటలను పరిశీలిం చి, పంట నష్టం చూసి పరిహారం ఇప్పించండి. లేకపోతే మాకు మరణమే శరణ్యం.
– తిరుపతయ్య, వెల్టూరు, పెద్దదగడ, చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా
ఎండిన పంటలను పరిశీలించి పరిహారం చెల్లించాలి
చిన్నంబావి మండల పరిధిలో సుమారు 10 వేల ఎకరాల పంటలు ఎండిపోయాయి. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఉంటుంది. అధికారుల మాటలు నమ్మి సాగు చేసిన రైతులకు వారే భరోసా కల్పించాలి. వెంటనే పరిశీలన చేసి పరిహారం అందివ్వాలి. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– రాజేందర్గౌడ్, రైతు సంఘం మండల కార్యదర్శి, చిన్నంబావి, వనపర్తి జిల్లా