– ఎన్నికల ప్రచారంతో బోసిపోతున్న అడ్డాలు
– రోజంతా ప్రచారంలో ఉంటే రూ.500 పైనే..
– ముందుగానే కూలీలను గుత్తా పట్టిన పార్టీలు
– ఇక్కడ కూడా మేస్త్రీల ‘అడ్డ’గోలు దోపిడీ
ఎన్నికల ప్రచారం అడ్డాపై కూలీలు జై కొడుతున్నారు. నెలరోజుల క్రితం వరకు ఉదయాన్నే చద్ది చంకన పెట్టుకుని పని కోసం నగరాలు, పట్టణాల్లోని అడ్డాలపైకి చేరిన వర్కర్లు ఇప్పుడు…చేతిలో జెండాలతో ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల ర్యాలీలో నినాదాలు చేస్తున్నారు. బిర్యానీలు, ప్యాకెట్ల భోజనంతో కడుపు నింపుకుంటున్నారు.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
తెలంగాణ సాధారణ అసెంబ్లీ ఎన్నికల పండుగ అడ్డాకూలీలకు ఉపాధి మార్గంగా మారింది. కూలి పని కోసం పొట్ట చేతపట్టుకుని నగరాలు, పట్టణాలకు వలస వచ్చే పల్లెలు ఇప్పుడు జెండాలు చేతపట్టి ఎన్నికల ర్యాలీల్లో జై కొడుతున్నాయి. ఆటపాటలు, కోలాటాలు, డప్పుల దరువులతో అడ్డా కూలీలు ఇప్పుడు ఎన్నికల ప్రచార కార్యకర్తలుగా మారారు. అభ్యర్థులు, నాయకుల వెంట ఇళ్లిల్లు తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. సభలు, ర్యాలీలను ముందుండి నడుపుతున్నారు. పల్లెల నుంచి వచ్చి…నగరాల్లో అడ్డాకూలీలుగా…భవన నిర్మాణ రంగ కార్మికులుగా పనులు చేసే కూలీలు ఓట్ల వేటలో సీటీలు కొడుతున్నారు. ఉదయాన్నే అడ్డా మీద ఉండాల్సిన పనిలేకుండా ఏకంగా ఇంటి వద్దకే వాహనాలు వచ్చి కూలీలను ప్రచారం కోసం తీసుకురావడం గమనార్హం. రోజువారీగా కూలీలను అడ్డామీదకు వెళ్లి తెచ్చుకోవడం కంటే కొందరు మేస్త్రీల దగ్గర పనిచేసే వారిని ఎన్నికలు పూర్తయ్యేంత వరకు గుత్తకు మాట్లాడుకున్నారు. అడ్డామీద ఉన్నప్పుడు ఒక్కోసారి పనులు దొరక్క తెచ్చిన చద్ది తిని వెళ్లిన కూలీలకు ఎన్నికల పుణ్యమాని ఆ దిగులే లేకుండా పోయింది. ఏ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లినా రోజువారీగా రూ.500 వరకు వస్తున్నాయి. పల్లె ప్రాంతాల్లో రోజుకు రూ.250 వరకు కూలీ ఇస్తున్నారు. ఎన్నికల ఉపాధి మార్గంలో మేస్త్రీల దోపిడీ కూడా బాగానే ఉన్నట్లు వర్కర్లు వాపోతున్నారు.
నగరంలో అడ్డాలన్నీ ఖాళీ…
ఖమ్మం నగరానికి చుట్టు పక్కల 50 కి.మీ పైబడిన మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు పదివేల మంది వరకు అడ్డా కూలీలు వస్తుంటారు. నగరంలోని పదికి పైగా కూడళ్లలో ఒక్కో అడ్డాపై వంద మొదలు రెండు వేల వరకు కూలీలు ఉంటారు. వీరు భవన నిర్మాణ పనులను ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఏ కూడలిలో చూసినా అడ్డా కూలీలు కనిపిస్తుంటారు. ఎవరైనా వారి ముందు వాహనం ఆపితే చాలు పని కోసం ఎగబడతారు. ఇలా పని కోసం ఎదురుచూసే వాళ్లు గత నెలరోజులుగా పలుచబడ్డారు. ఎన్నికల ప్రచారంలో వారంతా బిజీగా ఉండటంతో అడ్డాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఖమ్మంలో అతిపెద్ద కూలీ అడ్డాలు గాంధీచౌక్, ఎన్టీఆర్ కూడలి, జడ్పీ సెంటర్, శ్రీనివాసనగర్, కాల్వడ్డు…ఇలా అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
పనికి పని…తిండికి తిండి…
అడ్డా కూలీల్లో ఎక్కువ శాతం మందికి గతంలో పనిదొరికేది కాదు. ఏ పని దొరక్కపోతే 11 గంటల వరకు చూసి తిరుగు పయనం అయ్యేవారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేనప్పుడు, ఉపాధి పనుల జాబ్ కార్డులు లేని అనేక మంది ఇలా వచ్చేవారు. ఇప్పుడు అడ్డాతో పనిలేకుండా పనికి పని…తిండికి తిండి దొరకుతోంది. ర్యాలీలు, సభలు ఉన్నా…డివిజన్లలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలన్నా భారీగా జనం కనబడాలి. పట్టుమని పదిమంది కూడా లేకుండా వెళ్తే జనమే లేని ఆయన/ ఆమె ఇక ఎమ్మెల్యేగా గెలిచినట్టే..అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకోసమైనా కేడర్ లేకున్నా కూలీలనే కార్యకర్తల్లా వాడుకోవడం మినహా అభ్యర్థులు, పార్టీలకు మరో గత్యంతరం లేని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో ఉండే ఈ కూలీలకు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ సమయంలో వాళ్లున్న చోటికే భోజన ప్యాకెట్లు వస్తాయి. అభ్యర్థి బిడ్డో భార్యో ఇంటింటికి తిరిగి బట్టప్పజెప్పే కార్యక్రమం చేపడుతారు. ఆ సమయంలో వారితో పాటు మూడు, నాలుగు గంటలున్న కూలీలకు ఒక్కరికి రూ.200 పైనే చెల్లిస్తున్నారు. కోలాట బృందాల్లో ఉన్నవారికి మరో వంద, రెండొందలు అదనంగా ఇస్తున్నారు. చేరికల పేరుతో కొందరిని తీసుకొచ్చి కండువాలు కప్పిస్తున్నారు. అప్పుడు మాత్రం రూ.వెయ్యికి పైనే చేతుల్లో పెట్టి పంపుతున్నారు. సభలు ఉన్న రోజు రూ.250 + బిర్యానీ, పురుషులైతే క్వార్టర్ బాటిల్ సైతం ఇస్తున్నారు.
మేస్త్రీల దోపిడీ..
అడ్డామీద ఉన్నప్పుడు కమీషన్లు దండుకుని పనులు చూపించే మేస్త్రీలు ఇక్కడ కూడా అదే పని చేస్తున్నారు. ఒక్కో మేస్త్రీ కింద 50కి పైగా కూలీలుంటే ఆయనే చక్రం తిప్పుతున్నారు. నాయకులు ఆ మేస్త్రీతో గుంపగుత్తగా మాట్లాకుంటున్నారు. ఒక్కో కూలీకి రూ.100 చొప్పున మేస్త్రీ కమీషన్ దండుకొని కూలీలకు మాత్రం రూ.200, రూ.250 మాత్రమే చెల్లిస్తున్నారు. పెద్ద నగరాల్లో రూ.150 దండుకొని రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నట్లు స్థానిక కూలీలు చెబుతున్నారు. మరోవైపు భవన నిర్మాణరంగ కూలీలు ఎన్నికల ప్రచారంలో ఉండటంతో పలు భవనాల నిర్మాణం ఆగిపోగా…కొన్ని మందకొడిగా సాగుతున్నాయని బిల్డర్లు అంటున్నారు.
ఎన్నికల ప్రచారానికి పోతున్నాం.. : రాజు, ఎన్టీఆర్ సర్కిల్ అడ్డా, ఖమ్మం
నెలరోజులుగా ఎన్నికల ప్రచారానికి పోతున్నాం. అడ్డా మీదకు కొంతమందే వస్తున్నారు. మేస్త్రీ దగ్గర గుత్తకు మాట్లాడుకున్నారు. ఆయన చెప్పిన చోటుకు వెళ్తున్నాం. పొద్దున్నే అడ్డా మీదకు రాగానే ఓ ట్రాలీ ఆటో వచ్చి మమ్మల్ని ఎక్కించుకుని పోతుంది. సాయంత్రం మళ్లీ దించుతుంది. అప్పుడైనా…ఇప్పుడైనా మేస్త్రికి కమీషన్ ఇయ్యాల్సిందే. మా మేస్త్రీ చేతికింద వంద మంది దాకా పనిచేస్తున్నాం. కొందర్ని బీఆర్ఎస్, కొందర్ని కాంగ్రెస్ ప్రచారానికి పంపుతున్నాడు.