– నేను..పక్కా లోకల్
– బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. నేను..పక్కా లోకల్ అని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. గురువారం ఖమ్మంలోని 50, 55వ డివిజన్లలో కార్పొరేటర్లు రాపర్తి శరత్, మోతారపు శ్రావణి సుధాకర్ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. నేను..పక్కా లోకల్ అని, ఇక్కడే ఉంటా.. నైట్ హాల్ట్ ఖమ్మం. మరి కాంగ్రెస్ అభ్యర్థి నైట్ హాల్ట్ ఎక్కడ అని, నేను భూమి పుత్రుడిని ఇక్కడె పుట్టిన.. ఇక్కడే పెరిగిన ఇక్కడే చదువుకున్న.. నా కట్టే కాలేది ఇక్కడే అని అన్నారు. 70 ఏండ్ల వయసున్నాయన నాపై దుష్ప్రచారాలు చేస్తున్నాడని, ఓటమి భయంతో తుమ్మల నా నామినేషన్ను ఆపాలని చూసిండు అని, ఆయనది ఎప్పుడూ అధర్మ పోరాటమే.. ఎదురొడ్డి పోరాడే సంస్కృతి లేదని ఆరోపించారు. బస్టాండ్ నేను కట్టిస్తే.. ఆయన కట్టిండని ప్రచారం చేస్తున్నాడు.. ఆయన కట్టించిన బస్టాండ్ కట నేను రంగులేయించిన్నట ఇలాంటి అనేక దుష్ప్రచారాలు చేస్తున్నడు తుమ్మల. ఇదెక్కడి రాజకీయమో అర్థం కావడం లేదని, మందికి పుట్టిన బిడ్డను.. నాబిడ్డ అని ముద్దాడతుండు అని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిలో తుమ్మల చేసింది ఏమీ లేదు గుండు సున్నా అని ఆరోపించారు. తుమ్మల తెగిన గాలిపటం లాంటోడు. ఖమ్మంలో నామీద ఓడిపోయి.. పాలేరు పోయిండు.. పాలేరులో ఓడిపోయి… మళ్ల ఖమ్మం వచ్చిండు. నామీద గెలవలేక అనేక దుష్ప్రచారాలు చేస్తున్నడు..అలాంటి వారి మాటలు నమ్మవద్దు అని అన్నారు. మీ ముందు ఖమ్మం అభివృద్ధి మీ ముంగిట ఖమ్మం అభ్యర్థి ఉన్నాడన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే బానొత్ చంద్రావతి, దోరేపల్లి రవి కుమార్, పొన్నం వెంకటేశ్వర్లు, పాల నాగేశ్వరరావు, నల్లమోతు వేంకటేశ్వర రావు, పోటు సత్యనారాయణ, బత్తుల మురళీ, పారుపల్లి రాము, కొనకంచి యుగంధర్, వేగినాటి మధు, సాహు, ఆరెంపుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.