– కాంట్రాక్టర్లు, న్యాయవాదులు సైతం
– ఉమ్మడి మహబూబ్నగర్లో రాజకీయ చిత్రం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో అనేక మంది రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతలున్నారు.. క్రమక్రమంగా సీనియర్ నేతలు, రాజనీతిజ్ఞులు, రాజకీయ కుటుంబాలకు చెందిన వారు ఎన్నిలకు దూరంగా జరుగుతున్నారు.. అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ ఈసారి బరిలో మాత్రం వైద్యులు, ఉద్యోగులు, న్యాయవాదులు, బ్యాంకు ఉద్యోగులు, విద్యాసంస్థల అధిపతులు, కాంట్రాక్టర్లు ఉండటం విశేషం. వీరంతా ఉన్నత కుటుంబాలకు చెందిన వారే. రాష్ట్ర వ్యాప్తంగా చాలా
నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
నవ తెలంగాణ మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటివరకు అనేకమంది విద్యావంతులు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎస్ జైపాల్రెడ్డిది కల్వకుర్తి నియోజకవర్గం. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఈ ప్రాంతం వారే. తాజా శాసనసభ ఎన్నికల్లో విలక్షణమైన నాయకులు బరిలో నిలిచారు. అచ్చంపేట నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి చిక్కుడు వంశీకృష్ణ నిలబడ్డారు. ఇతను వైద్యశాస్త్రంలో పట్టా పొందారు. ఆయనకు పోటీగా బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు నిలిచారు. ఈయన 2014, 2018లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత డాక్టరేట్ సాధించారు. దీంతో ఇద్దరి విజయావకాశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కె.రాజేష్ రెడ్డి బరిలో నిలిచారు. రాజేష్రెడ్డి దంత వైద్యులు. అదేవిధంగా మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి సైతం డాక్టర్ కావడం గమనార్హం. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో నాగం బీఆర్ఎస్లో చేరారు.
నారాయణపేట జిల్లా నియోజకవర్గ బరిలో నిలిచిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చిట్టం పర్ణిక రెడ్డి ఇద్దరూ వైద్యులే. మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు.. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి కూతురు పర్ణిక రెడ్డి బరిలో నిలవడంతో ఇక్కడ పోటీ ఆసక్తిగా మారింది.
అలంపూర్ బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్ న్యాయవాది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ చట్టంలో ఫీల్డ్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి వృత్తిరీత్యా వైద్యులు. ఒక పర్యాయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయనకు ప్రత్యర్థిగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అనిరుద్ రెడ్డి పోటీపడుతున్నారు. ఈయన ఉన్నత చదువులు చదివి మొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నారు.
మక్తల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వాకిట అశోక్కుమార్ బరిలో నిలిచారు. వీరు ఉన్నత చదువులు చదివి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డికి సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా పేరు ఉంది. వాకిట అశోక్ కుమార్ జడ్పీచైర్ పర్సన్ బాధితులు నిర్వహించిన అనుభవం ఉంది. దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా గవినోళ్ల మధుసూదన్ రెడ్డి బరిలో నిలిచారు. ఆల కాంట్రాక్టర్ కాగా, గవినోళ్ల హైకోర్టు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
మహబూబ్నగర్ నుంచి తెలంగాణ ఉద్యమ నేత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతగా పనిచేసిన వి.శ్రీనివాస్గౌడ్ ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా ఉన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి ఎన్నం శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు. ఈయన కూడా బ్యాంకు ఉద్యోగి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఇద్దరు తెలంగాణ ఉద్యమకారుల మధ్య జరుగుతున్న పోటీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.
వనపర్తి నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొదట న్యాయవాద వృత్తిలో ఉండేవారు. మరోసారి వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇతనికి పోటీగా ప్రముఖ కాంట్రాక్టర్ తుడి మెగారెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పోటీ చేస్తున్నారు. ఈమె ఉన్నత విద్యావంతురాలు. కల్వకుర్తి నుంచి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ మరోసారి బరిలో నిలిచారు. ఇతను టీడీపీలో రాజకీయ అనుభవం సంపా దించారు. కాంగ్రెస్ నుంచి ప్రముఖ విద్యావేత్త రెండుసార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో నిలిచారు. రసవత్తర పోరు నడుస్తోంది.
కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మరోసారి తలపడుతున్నారు. గతంలో ఇతను కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇతనికి పోటీగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. జూపల్లి బ్యాంకు ఉద్యోగి కాగా, బీరం హర్షవర్దన్రెడ్డి హైకోర్టు న్యాయవాదిగా విధులు నిర్వహించారు. జూపల్లి కాంగ్రెస్లో చేరడంతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం వేడెక్కింది. ఈన ఇయోజకవర్గంలో గెలుపు వెరిని వరిస్తుందనేది చర్చోపచర్చలు సాగుతున్నాయి.