నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం ఉదయం ప్రయాణికులతో వెళుతున్న పడవ నదిలో బోల్తా పడింది. దీంతో గంగా నదికి పూజ చేసేందుకు వెళ్లిన నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. చిన్న బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్దేపుర్ ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన అక్కడ ఉన్న మత్స్యకారులు.. బాధితులను కాపాడేందుకు వెంటనే నదిలోకి దూకారు. కొంత మందిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరికొందరి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. 20 మందికి పైగా ఆచూకీ లభించడం లేదని అధికారులు తెలిపారు. బాధితుల్లో కొందరు ఆపస్మారక స్థితిలోకి వెళ్లారని..వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించామని వారు వెల్లడించారు.