![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/11/IMG-20231106-WA0397.jpg)
నవతెలంగాణ-గంగాధర: గర్శకుర్తి గ్రామాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే మండల కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ భరోసా నిచ్చారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. గర్శకుర్తి గ్రామం ఇప్పటికే మండలంగా ప్రకటించాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో జాప్యమైందన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ ను జనవరి నుండే అందించేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనే విషయం ప్రజలు గ్రహించాలని కోరారు. మూడు వైద్య కళాశాలలు ఉన్న స్థాయి నుంచి స్వరాష్ట్ర తెలంగాణలో 33 జిల్లాలకు 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం సువర్ణ అధ్యాయం అన్నారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు సువర్ణ అవకాశం అన్నారు. గతంలో వైద్య విద్యను అభ్యసించాలంటే అనేక ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, సీఎం కేసీఆర్ ముందు చూపు, దూరదృష్టితో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం వల్ల సంవత్సరానికి 10000 మంది వైద్యులు బయటకు వస్తారని అన్నారు. వైద్యుల వల్ల పేద ప్రజలకు ఉచిత, మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. తెలంగాణ విద్యార్థులకు వైద్య, విద్యను చేరువ చేయాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసారని, ప్రజలు, యువకులు, విద్యార్థులు ఈ విషయం గ్రహించాలని సూచించారు. ఏకకాలంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల తరగతులను ప్రారంభిస్తూ తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిదని అన్నారు. స్వాతంత్ర్య అనంతరం ఏడున్నర దశాబ్దాలలో వైద్య విద్యలో ఎన్నడూ, ఎక్కడా జరుగని అద్భుతాన్ని తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించిందని అన్నారు. సుదీర్ఘ కాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందనడానికి వైద్య విద్యలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులే నిదర్శనం అన్నారు. లక్షలు పోసిన దొరకని సీట్లు ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చాయని, పేదింటి బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ పట్టా పొందే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. మెడికల్ సీట్లను అనేక రెట్లు పెంచడం ద్వారా దేశంలో తెల్లకోటు విప్లవం తీసుకొచ్చామని, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ ఉండడం వల్లే ఇవాళ మనం ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేయడం జరుగుతుందని, దళితులు పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి దళిత బిడ్డలు చదువుకునేందుకు ప్రభుత్వం తరఫున ప్రతి విద్యార్థి పై సంవత్సరానికి లక్షా 25 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి విదేశాల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని, దళిత బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ లుగా, సివిల్స్లో ఉద్యోగం సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఎన్నో రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ పక్షాన చొప్పదండి ఎన్నికల బరిలో నిలిచిన సౌమ్యుడు, స్థానికుడు రవిశంకర్ ను కారు గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని వినోద్ కుమార్ ప్రజలను కోరారు. అనంతరం గర్షకుర్తి మాజీ ఎంపీటీసీ చిప్ప లావణ్య- చక్రపాణి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా పార్టీ కండువ కప్పారు. ఈ ఎన్నికల ప్రచార సభలో చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్, ఎంపీపీ శ్రీరాం మధూకర్, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి, కురిక్యాల సింగిల్ విండో ఛైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సర్పంచ్ అలువాల నాగలక్ష్మి, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, మాజీ సర్పంచ్ కల్వకోట సవితాదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.