నవతెలంగాన – చిత్తూరు
ప్రేమవివాహం చేసుకొన్న మూడు నెలలకే ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారప్పగారి రంజిత్కుమార్ (24) చిత్తూరు జిల్లా వికోట మండలం కుంభర్లపల్లి గ్రామ నివాసి. ఇతను పదో తరగతి వరకూ చదివాడు. కొంతకాలం క్రితం గుంటూరు జిల్లా తెనాలిలోని మేనత్త ఇంటికి వద్దకు వచ్చి అక్కడే ఉంటూ ఓ వస్త్ర దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ నీలం హర్షప్రియ అనే యువతిని ప్రేమించి గత మార్చి నెల 8న పెద్దల సమక్షంలో వివాహం చేసుకొన్నాడు. అనంతరం ఇతను యనమలకుదురులో కాపురం పెట్టాడు. ఇతని అత్త వీరవెంకటనాగలక్ష్మి సుధారాణి కూడా వీరితోనే ఉంటోంది. ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తండ్రి మంజునాథతో ఫోన్లో మాట్లాడాడు. తాను భోజనం చేసిన తర్వాత మళ్లీ మాట్లాడతానంటూ ఫోన్ పెట్టేశాడు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అత్త వీరవెంకట నాగలక్ష్మి సుధారాణి, రంజిత్కుమార్ సోదరుడు మహేష్కుమార్కు ఫోన్ చేసి రంజిత్కుమార్ ఇంట్లోని పడక గదిలో ఉరేసుకొన్నట్లు వివరించింది. స్థానికుల సాయంతో తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే రంజిత్ కుమార్ విగత జీవిగా ఉన్నాడు. తండ్రి, ఇతర కుటుంబసభ్యులు బుధవారం ఉదయం యనమలకుదురు చేరుకొని కుమారుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు లేదా కుటుంబ వివాదాలు ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.