– ఎంపిపి కూర మాణిక్యరెడ్డి
నవతెలంగాణ- చిన్నకోడూరు: ప్రజల కష్టసుఖాలు బాగా తెలిసిన మంత్రి హరీశ్ రావుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి కోరారు. చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి గ్రామంలో సిద్దిపేట శాసన సభ బిఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు పక్షాన భారాస మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమస్యలు ఉన్నాయని క్షణికావేశంలో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయోద్దనీ, మంత్రి హరీశ్ రావు దృష్టికి మీమీ గ్రామంలోని సమస్యలు తీసుకెళ్ళి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పొడిచే జాతీయ పార్టీ అభ్యర్థులను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగేవని కానీ నేడు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. చిన్నకోడూరు మండలంలో సుమారు 18వేల మందికి రైతు బంధు అందుతుందని తెలిపారు. రైతు భిమా వెంటనే అందించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. మరో దఫా అధికారం చేపట్టిన వెంటనే ఏ రకమైన మరణం సంభవించినా కేసిఆర్ భీమా అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టు వల్ల నష్టం వాటిల్లిన వారికి భూమి అందేలా చర్యలు తీసుకుంటామని, నీటి కాల్వల నిర్మాణం కోసం సర్వే పూర్తి అయ్యిందని, త్వరలోనే కాలువల ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. అలాగే రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ కి ఎవరితో పోటీ లేదనీ హరీశ్ రావు గెలుపు ఖాయమైందని, మెజారిటీ ఎంత వస్తుందని ప్రజలు చూస్తున్నారనీ అన్నారు. మండలంలోని ఏ గ్రామంలో హరీశ్ రావు కి ఎక్కువ ఓట్లు వేస్తే ఆ గ్రామాన్ని గుండె లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాడని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్ పర్సన్ కొండంత వనిత రవిందర్ రెడ్డి, ఎంపిపి ఉపాధ్యక్షుడు పాపయ్య, పిఏసిఎస్ చైర్మన్ లు సదానందం, కనకరాజు, గ్రామ సర్పంచ్ మహేందర్, వివిధ గ్రామాల ఎంపిటిసి లు, సర్పంచ్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.