నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మంలో ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులివ్వాలని యాదవ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని వాదించాయి. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ.. విగ్రహంలో పిల్లన గ్రోవి, పింఛం తొలగించినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, నిర్వాహకులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది.