నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో కొకైన్ పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ నుంచి ముంబై వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నైరోబి నుంబి ముంబై వెళ్తున్న కెన్యాకు చెందిన ప్రయాణికుడిని చెక్చేశారు. దీంతో అతని లగేజీలో 1,698 గ్రాముల కొకైన్ లభించింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ సందర్భంగా తాను ముంబై వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడించారు. దీంతో డ్రగ్స్ను ముంబైకి తరలిస్తున్నారని స్పష్టమైందని చెప్పారు. అనంతరం ముంబైలో ఆర్డర్ను తీసుకోవడానికి వచ్చిన కెన్యా జాతీయురాలిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. నిందితులిద్దరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డీఆర్ఐ అధికారులు 42 పర్యాయాలు కొకైన్, హెరాయిన్ను సీజ్ చేశారు. ఇందులో 31 కేజీల కొకైన్ ఉండగా, 96 కికోల హెరాయిన్ ఉన్నదని పేర్కొన్నారు.