నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరామని.. రేపుకేంద్ర మంత్రి హర్ధిప్ సింగ్ పూరీ ని కూడా కలుస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందన్నారు. రాష్ట్రానికి చేయూత మద్దతు ఇవ్వాలని కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. గత తొమ్మిదేళ్లలో ఐదుగురు రక్షణ శాఖ మంత్రులను ఇప్పటికి 15 – 20 సార్లు కలిశామన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే శరవేగంగా విస్తరిస్తున్న నగరమని తెలిపారు. దేశంలో 44% ఉద్యోగాలు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘వ్యాక్సిన్ ఉత్పత్తికి హైదరాబాదు ప్రపంచ కేంద్రంగా మారింది. ఫార్మా బయోటెక్ ఐటి ఏరోస్పేస్ రంగాల్లో శరవేగమైన అభివృద్ధి హైదరాబాదులో కొనసాగుతోంది. అందుకు అనుగుణంగా మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రధాని మోదీ, అయిదుగురు రక్షణ మంత్రులను కలిసి అనేక విజ్ఞప్తులు చేశాం. స్కై కారిడార్లు నిర్మాణానికి సహకారం అందించాలని ఈరోజు కూడా కోరాము. స్కై వే ప్రాజెక్టులు మంజూరు చేయడానికి రక్షణ శాఖ వద్ద ఉన్న భూములు ఇవ్వడానికి ఇప్పటికి మనసు రావడం లేదు. రక్షణ భూములకు రాష్ట్ర ప్రభుత్వ భూములు ఇస్తామని ప్రతిపాదనలు పెట్టాము. రాజీవ్ రహదారి విస్తరణకు అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలని కోరాము. గత లోక్సభలో.. అలాగే ప్రస్తుత లోక్సభలో పలు పార్టీ ఎంపీలు అనేక సందర్భాల్లో లేవనెత్తారు. 56 ఎకరాల రక్షణ స్థలాన్ని ఇస్తే అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్థలం ఇస్తుందని ప్రతిపాదించాము. రక్షణ భూములు ఇచ్చినట్లయితే హెచ్ఎండీఏ వెంటనే పనులు చేపడుతుందని కూడా రక్షణ మంత్రి కి చెప్పాము. హైదరాబాద్ లో 142 లింక్ రోడ్లు ప్లాన్ చేసాము. వాటిలో 1, 2 చోట్ల రక్షణ భూములు ఉన్నాయి. వాటిని ఇవ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు. రక్షణ శాఖ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములు ప్రజావాసరాలకు ఇవ్వాలని కోరాము. రేపు హరిదీప్ సింగ్ ని కలుస్తాము. మెట్రో రెండో దశ, ఎయిర్ పోర్ట్ అనుసంధాన మెట్రో పై చర్చిస్తాం. ఎస్సార్డీపీ కార్యక్రమంలో 35 అండర్ పాస్ లు, పై వంతెనలు పూర్తి చేసాము. కేంద్ర హోంమంత్రిని సమయం కోరాము. రసూల్ పుర జుంక్షన్లో ఉన్న భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతున్నాము. పఠాన్ చేరు నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో ప్రతిపాదనకు అనుమతివ్వాలని కోరుతున్నాము. 9 ఏళ్లలో తెలంగాణకు చేసింది ఏమీ లేదు’’ అని కేటీఆర్ అన్నారు.