నవతెలంగాణ – హైదరాబాద్: వనపర్తి సమీపంలోని చిట్యాలలో పురాతన ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. మూలోనిగుట్ట సమీపంలోని తగళ్లగడ్డలో 14 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇనుము ఉత్పత్తి తర్వాత మిగిలే వ్యర్థమైన చిట్టెం కుప్పలుగా కనిపిస్తోందని బృంద సభ్యులు భైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు. తమ పూర్వీకులు బీడు భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చుకునేటప్పుడు 20 అడుగుల చుట్టు కొలతతో ఇటుకల కట్టడం ఆనవాళ్లు, ఇనుము కరిగించడానికి వాడే మూసలు, పెద్ద పెద్ద గొట్టాలు, మట్టి పాత్రలు దొరికినట్లు పొలం యజమాని మాదారం జగపతిరావు తెలిపారు. గ్రామానికి చెందిన ఎర్రగుట్టలో ఇప్పటికీ మట్టి తవ్వితే ముడి ఇనుప ఖనిజం ముద్దలు, రాళ్ల రూపంలో లభిస్తోంది. ఈ ఆనవాళ్లను బట్టి చిట్యాలలో 2 వేల సంవత్సరాలకు పూర్వమే వ్యయసాయ పనిముట్లకు, యుద్ధ సామాగ్రికి అవసరమైన ఇనుము ఉత్పత్తి చేసే పరిశ్రమ ఇక్కడ ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. చిట్టెం కుప్పల వల్లే ఈ గ్రామానికి చిట్యాల పేరు స్థిరపడిందని పేర్కొన్నారు.