- ప్రజల కోసమే పార్టీలు మారుతున్నాం
- మద్దతు ఇస్తానంటే ఒప్పుకొని కాంగ్రెస్ పెద్దలు
- ఇష్టం లేకున్నా కారు ఎక్కుతున్న ఉద్యమకారులు
- కారును దిగి హస్తాన్ని అందుకుంటున్న మరికొందరు
నవతెలంగాణ – భువనగిరి
ఊరంతా ఒకదారైతే. ..ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్టు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారుతున్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 స్థానాలలో నువ్వా నేనా అన్న చందంగా పోటీ నెలకొనడంతో టికెట్లు ఆశించిన వారు ఆశిస్తున్న వారు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు జంపు జలానీలు అవుతున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) టీడీపీలో(TDP) రాజకీయ ప్రవేశం చేసి విద్యుత్ శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా పలు పదవులు పొందారు..ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏమైందో ఏమో కానీ బీజేపీలో చేరారు. దళిత బంధు సమయంలో కేసీఆర్ మోత్కుపల్లి పరామర్శించి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు అక్కడ తగిన ప్రాధాన్యత లేదని ఇటీవల రాంరాం చెప్పి కాంగ్రెస్ పడవ ఎక్కడానికి ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఆ పార్టీ అతన్ని మందలించలేదు. మద్దతు ఇస్తానంటే కాంగ్రెస్ పెద్దలు తీసుకోవడం లేదని బహిరంగంగానే మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. మాజీ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న కుంభ అనిల్ కుమార్ రెడ్డి రెండు నెలల క్రితం కోమటిరెడ్డి బాధలు తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీ నాశనానికి కోమటిరెడ్డి కారణమని బహిరంగ విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ లో చేరారు. సర్వే ఫలితాలు అధికంగా కుంభముకు అనుకూలంగా రావడంతో తిరిగి నెల రోజుల్లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ నుండి టికెట్ ఆశించి బంగపడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. వైయస్సార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైయస్సార్ మృతి చెందడంతో, వైఎస్ఆర్సిపి అనంతరం బిజెపిలో చేరారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు తగిలిన రేవంత్ రెడ్డి సహకారంతో పార్టీలో చేరారు. అక్కడ ఉండలేక తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి 2014లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ అనుకూలంగా ప్రసంగాలు చేసి కోమటిరెడ్డి అడ్డు రావడంతో తిరిగి బీఆర్ఎస్ కండువా కప్పుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ఇక్కడ ప్రజలను ఆశ్చర్య చేశారు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే ఆర్థిక ఉన్న వారికే కాంగ్రెస్లో ప్రాధాన్యత ఇస్తున్నారని బిసి నాయకుడు మధు గ్యాస్ లాంటి వారిని అవమానిస్తున్నారని ఆరోపిస్తూ రెండు రోజులకి బీఆర్ఎస్ లో చేరారు.
ఇదే తరహాలో కోదాడ నుండి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రోటోకాల్ అధికారి గూడూరు నారాయణరెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుండి పోటీ చేయనున్నారు. వీరేగాక జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రాత్రికిరాత్రే ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు ఆయా పార్టీలో ఉన్న అసంతృప్తివాదులు వేరే పార్టీలో చేరకుండా బుజ్జగింపులు, తాయిలాలు ప్రకటిస్తున్నారు. భువనగిరి ఆలేరు నియోజకవర్గంలోని వివిధ పార్టీల కౌన్సిలర్లను వేలంపాట మాదిరిగా డబ్బులు చెల్లిస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. సిద్ధాంతాలు విధానాలు ప్రస్తుతం ఇది నియోజకవర్గాల్లో పనిచేయడం లేదు